నవరాత్రులలో అమ్మవారి అలంకారాలు ఇవే.

మొదటి రోజు అశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఈ రోజున శ్రీ స్వర్ణ కవచలం కృత దుర్గాదేవిగా అలంకరిస్తారు.. ఈ అవతారంలో అమ్మవారు శూల, ఖడ్గ ,త్రిశూల, చక్ర వంటి ఆయుధాలను ధరించి, సింహం వాహనం మీద ఉన్నట్టుగా అలంకరిస్తారు. శ్రీ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారికి చింతపండు పులిహోర, సజ్జ అప్పాలు, చలిమిడి, వడపప్పు పాయసం ప్రసాదంగా పెడతారు.

రెండవ రోజు అశ్వయుజ శుద్ధ విదియ ఈ రోజున బాలా త్రిపుర సుందరీ దేవిగా లేత గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు. త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి పాయసం, పరమాన్నం నైవేద్యంగా పెడతారు.

మూడవరోజు అశ్వయుజ శుద్ధ తదియ ఈరోజున అమ్మవారిని వేదమాత గాయత్రీ దేవిగా కాషాయ రంగు చీరలో అలంకరిస్తారు. వేదమాత గాయత్రీ దేవి అమ్మవారికి చింతపండు పులిహోర అల్లం గారెలు, ప్రసాదంగా సమర్పిస్తారు.

నాలుగవ రోజు అశ్వయుజ శుద్ధ చవితి. ఈరోజున అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా స్వచ్ఛమైన బంగారు రంగు చీరలో అలంకరిస్తారు. లలిత త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి కొబ్బరి అన్నం, చింతపండు పులిహోర పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.

ఐదవ రోజు అశ్వయుజ శుద్ధ పంచమి. ఈ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా పసుపు చందన రంగు చీరతో అలంకరిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి దద్దోజనం, కట్టే పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరవ రోజు అశ్వయుజ శుద్ధ షష్టి. ఈ రోజున మహాలక్ష్మి దేవిగా గులాబీ రంగు చీరలో అమ్మ వారిని అలంకరిస్తారు. మహాలక్ష్మి దేవి అమ్మవారికి పూర్ణం బూరెలు, రవ్వ కేసరి, చక్కర పొంగలి నైవేద్యంగా ఇస్తారు.

ఏడవ రోజు అశ్వయుజశుద్ధ సప్తమి. ఈ రోజున శ్రీ మహా సరస్వతి దేవిగా తెలుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజునే మూలా నక్షత్రం కూడా వస్తుంది. శ్రీ మహా సరస్వతి దేవి అమ్మవారికి పాయసం, గుగ్గిళ్ళు, శాకాన్నం, అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదవ రోజుఅశ్వయుజశుద్ధ అష్టమి. ఈ రోజున శ్రీ దుర్గా దేవిగా ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు. శ్రీ దుర్గా దేవి అమ్మవారికి కదంబం నైవేద్యంగా ఇస్తారు

తొమ్మిదవ రోజు అశ్వయిజ శుద్ధ నవమి. ఈ రోజును మహర్నవమి అని కూడా అంటారు. ఈ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని గా ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు. శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి గారెలు, పాకం గారెలు, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పిస్తారు.

పదవరోజుఅశ్వయుజ శుద్ధ దశమి. ఈ రోజునే విజయదశమి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సేమియా పాయసం, కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం, పరమాన్నం నైవేద్యంగా పెడతారు

ఇలా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్క రూపంలో అలంకరించి, పూజలు చేస్తూ దసరా పండుగ జరుపుకుంటారు.

విజయదశమి రోజున విజయవాడలో అమ్మవారి కి కృష్ణా నదిలో తెపోస్తవం జరిపిస్తారు.