కర్నూలు: జిల్లా కలెక్టర్ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళి

కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు కర్నూలు, ఆగస్టు 23 బ్రిటీష్ వాళ్ల తుపాకీకి రొమ్ము విరిచి ఎదురు నిలిచిన ధీరుడు ‘ఆంధ్ర కేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు చిరస్మరణీయులని అని జిల్లా కలెక్టర్  పి.కోటేశ్వరరావు అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె. వి.శ్రీనివాసులు, డిఆర్ ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, జిల్లా అధికారులు, ప్రకాశం పంతులు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

జిల్లా కలెక్టర్  పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ…ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు. 1928లో మద్రాసులో ‘ గో బ్యాక్ అంటూ సైమన్ కమిషనను నినదించి బ్రిటీష్ వారి తుపాకికి ఎదురు నిలిచిన ధీరుడన్నారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ‘ఆంధ్ర కేసరి’ బిరుదును ఇచ్చి గౌరవించారన్నారు. స్వాతంత్రోద్యమంలో పోరాటం సాగించి జైలు జీవితాన్ని అనుభవించారన్నారు. ఆయన బాట అందరికీ ఆదర్శమన్నారు.