ప్రజలకు అన్ని సేవలు అందించాలి
గుత్తి, సెప్టెంబరు 16:
ప్రజలకు స్థానికంగానే అన్ని రకాల సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వార్డు సచివాలయం ఉద్యోగులను ఆదేశించారు.
గురువారం గుత్తి పురపాలక సంఘం లోని 9వ వార్డు, 23 వ వార్డు కు సంబంధించిన సచివాలయాలలో తనిఖీ చేపట్టారు.
వార్డు సచివాలయంలో తనిఖీ చేసి ప్రభుత్వ పథకాల పోస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీలలో ఏ చిన్న పనికైనా మున్సిపాలిటీ కార్యాలయాలకు, సంబంధిత సెక్రెటరీ, రెవెన్యూ ఆఫీసర్ వద్దకు వెళ్లాల్సి వచ్చేదని.. సచివాలయ వ్యవస్థను అమలులోకి వచ్చిన తర్వాత పట్టణాలలో ప్రతి నాలుగు వేల జనాభాకు ఒక వార్డు సచివాలయంని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు,
క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అక్కడే అధికారుల ద్వారా పరిష్కరింపజేసి పరిపాలన చేసేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో అధికారులను నియమించి ఈ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను ఇంకా మంచిగా అందించే అవకాశం ఉంటుందన్నారు. వార్డు సచివాలయ స్థాయిలో సంక్షేమ పథకాల అమలు కోసం వెల్ఫేర్ అసిస్టెంట్ లు, మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులు, ప్రజారోగ్యానికి ఏఎన్ఎమ్ లు అంటూ వేరు వేరు అధికారులను నియమించడం జరిగిందని, అంతేకాకుండా సచివాలయం అన్నిరకాల సేవలకు ఒక కేంద్రంగా మారాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సచివాలయం ద్వారా 540 కి పైగా సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆయా శాఖల పరంగా అవసరమైన సేవలను వార్డు సచివాలయం ద్వారా పొందవచ్చన్నారు. ప్రభుత్వ సేవలు అందించడంలో అవినీతి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సకాలంలో అందించడమే వార్డు సచివాలయ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
సచివాలయానికి వెళితే సమస్య పరిష్కారం అవుతుందనే భరోసా ప్రజల్లో కలిగించేలా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని, మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సచివాలయ సిబ్బందికి హెచ్చరించారు. అనంతరం ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ వన్నియర్ సాహెబ్, కమిషనర్ గంగిరెడ్డి, అనంతపురం ఆర్డీవో మధుసూదన్, తాసిల్దారు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.