రాఖీ పండగ ప్రాముఖ్యత!

రక్షా బంధన్ అంటే తెలుసా?

ప్రపంచంలో మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే పండగ రాఖి పండగ. ఈ పండుగను ప్రపంచమంతటా  జరుపుకుంటారు. వారు తమ సోదరీ, సోదరుల అనుబంధానికి చిహ్నంగా రాఖీ పండుగను జరుపుకుంటారు.

రాఖీ పండగ ప్రాముఖ్యత: మన దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలు రాఖీ పండుగ ఒకటి. ఈ పండుగను శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరుపుకుంటారు. అందుకే రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మొదటగా ఉత్తర పశ్చిమ భారతదేశంలో వారు మాత్రమే ఈ పండుగను జరుపుకునేవారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ కలిసి జరుపుకుంటున్నారు. చెల్లెలు కానీ అక్క గాని సోదరునికి రాఖీ కట్టి ఎప్పుడూ తనకు రక్షణగా అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరుడు రాఖీ కట్టించుకొని తనకు రక్షణగా ఉంటానని ఈ రక్షాబంధన్ ద్వారా తెలుపుతాడు. ప్రాముఖ్యతతో కూడుకున్న పండుగను జరుపుకునే ఆచారం వెనుక ఎన్నో పురాణ కథలు ఆదర్శంగా ఉన్నాయి.

రాఖీ పండగ రావడానికి వెనుక ఉన్న చరిత్ర: పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య చాలాసార్లు యుద్ధాలు జరిగేవి, అలా ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య ఒక పుష్కర కాలం పాటు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో బలిచక్రవర్తి దేవతల రాజు  ఇంద్రుడిని ఓడిస్తాడు. దేవేంద్రుడు ఓడిపోయినందుకు వెళ్లి అమరావతిలో తలదాచుకుంటాడు. అది చూసిన ఇంద్రుడి భార్య బాధతో విష్ణు దగ్గరికి వెళ్లి నా భర్త గెలిచే మార్గం చెప్పమని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు పత్తితో తయారైన దారాన్ని ఇచ్చి ఇది ఇంద్రుని చేతికి కట్టమని చెప్పాడు. సచిదేవి అలాగే చేస్తుంది. తర్వాత యుద్ధంలో ఇంద్రుడు, బలి చక్రవర్తి పై తిరుగులేని విజయాన్ని పొందుతాడు. తిరిగి మళ్లీ మూడు లోకాలకు రాజు అవుతాడు. సచి దేవి ఇంద్రునికి కట్టిన రక్షణ మొట్టమొదటి రాఖీగా పిలవబడింది. ఈ విధంగా రక్షాబంధన్ ప్రారంభమైందని మన పూర్వీకులు తెలుపుతారు.

ఇదే కాక మహాభారతంలో కూడా రాఖీ పౌర్ణమి కి సంబంధించిన ఒక సంఘటన ఉంది. శ్రీకృష్ణుడు రాక్షసుడైన శిశుపాలుడు నీ చంపాలని నిర్ణయించుకొని తన చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని విడుస్తాడు. ఆ సమయంలో అది కృష్ణుని చేతికి తగిలి రక్తం కారుతుంది, అది గమనించిన ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుని చేతికి కడుతుంది. అప్పుడు కృష్ణుడు నన్ను అన్నలా భావించావు. నేను నీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని మాట ఇస్తాడు. అందువల్లదుశ్శాసనుడి దురాగతం నుండి ద్రౌపదిని రక్షించాడు. ఈ కథ ద్వారా కూడా రాఖీ పండుగ జరుపుకుంటారని చెబుతుంటారు.

విష్ణు పురాణంలో కూడా ఒక కథ ద్వారా రాఖీ పండుగ జరుపుకుంటారు బలి చక్రవర్తి మహావిష్ణువును, పాతాళంలోకి తీసుకొని వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు భార్య లక్ష్మీదేవి ,విష్ణువును తిరిగి తీసుకుని రావడం కోసం బ్రాహ్మణ  స్త్రీగా మారి బలి చక్రవర్తి దగ్గరకు వెళుతుంది. నా భర్త ఒక పని మీద వెళ్ళాడు, అంతవరకు నేను మీ దగ్గరే ఉంటానని వేడుకుంటుంది. బలి చక్రవర్తి సరేనని ఒప్పుకుంటాడు. శ్రావణమాసంలో వచ్చిన పౌర్ణమి రోజు బ్రాహ్మణ స్త్రీ బలి చక్రవర్తికి రక్షగా రాఖీ కడుతుంది. దానికి బలిచక్రవర్తి నన్ను అన్నలా భావించి రక్షకట్టారు, నేను నిన్ను సోదరిలా భావిస్తాను, నేను నీకు మాట ఇస్తున్నాను, నీకు ఏం కావాలో కోరుకోమంటాడు. నా భర్తను నా దగ్గరకు పంపమని కోరుకుంటుంది. ఎవరు అని అడగగా లక్ష్మీదేవి తన రూపంలోకి మారి విష్ణువు గురించి చెబుతుంది. బలిచక్రవర్తి విష్ణుమూర్తిని లక్ష్మీదేవి వద్దకు పంపి, కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా మా దగ్గరికి వచ్చి వెళ్ళమని కోరుకుంటాడు. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున వచ్చి రక్షకట్టి వెళ్తానని సమాధానం ఇస్తారు. ఈ విధంగా కూడా రక్షాబంధన్ జరుపుకుంటారని ప్రతీక.

హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో ఈ పండుగను సోదరులు సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు చిహ్నంగా రాఖీ పండుగను జరుపుకుంటారు రాఖీ పండుగను తోడబుట్టిన వారు మాత్రమే కాదు అన్నా చెల్లెలు అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ జరుపుకోవచ్చు.